ఆఫ్ఘనిస్తాన్లో మరోసారి భూకంపం సంభవించింది. 6.3 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం వల్ల ఢిల్లీ ఎన్సీఆర్, జమ్ముకశ్మీర్లోనూ ప్రకంపనలు వచ్చాయి. ఈ ఘటనలో 9 మంది చనిపోగా, 15 మంది గాయపడ్డారు. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ఆదివారం అర్ధరాత్రి ఆఫ్ఘనిస్తాన్లోని పర్వత హిందూ కుష్ ప్రాంతంలో 6.3 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే (యూఎస్జీఎస్) తెలిపింది. పాకిస్తాన్ సరిహద్దుకు దగ్గరగా భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం వచ్చింది. రాత్రి 11:47 గంటలకు భూకంపం వచ్చినప్పుడు చాలా మంది తమ ఇళ్లలోనే ప్రకంపనలను గమనించారు. ఈ భూకంప కేంద్రం జలాలాబాద్కు 42 కిలోమీటర్ల దూరంలో, బసావుల్కు 36 కిలోమీటర్ల దూరంలో ఉందని యూఎస్జీఎస్ గుర్తించింది.
భారత్లోనూ భయాందోళనలు
ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం రావడంతో జమ్ముకశ్మీర్, ఢిల్లీ ఎన్సీఆర్తో పాటు ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో కూడా భూమి కంపించింది. దీంతో కొన్ని పట్టణాల్లో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. గతంలో, 2025 ఏప్రిల్లో కూడా ఆఫ్ఘనిస్తాన్లో 5.8 తీవ్రతతో వచ్చిన భూకంపం వల్ల ఉత్తర భారత్లో ప్రకంపనలు వచ్చాయి. ఇక 2023 అక్టోబర్లో ఆఫ్ఘనిస్తాన్ పశ్చిమ ప్రాంతంలో వచ్చిన శక్తివంతమైన భూకంపం వేలాది మంది ప్రాణాలను బలిగొంది.





