- అహ్మదాబాద్లో టేకాఫ్ అయిన వెంటనే దుర్ఘటనకు గురైన ఎయిర్ ఇండియా విమానం
- 274 మంది మృతి… భారత్లో 15 ఏళ్లలో జరిగిన అతిపెద్ద విమాన ప్రమాదం
అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్కు బయల్దేరిన ఎయిర్ ఇండియా AI-171 విమానం, టేకాఫ్ అయిన కేవలం 36 సెకన్లకే భూమిపై కుప్పకూలి మంటల్లో దగ్ధమైంది. ఘటనలో మొత్తం 274 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇవిలో 242 మంది విమాన ప్రయాణికులు కాగా, మిగతా వారు భవనంలో ఉన్న విద్యార్థులు, స్థానిక నివాసితులు. విమానంలోని 243 మందిలో… కేవలం ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. అతను భారత సంతతికి చెందిన బ్రిటన్ పౌరుడు.
ప్రమాదానికి ముందు… విమానం 650 అడుగుల ఎత్తు చేరుకున్నప్పుడు, పైలట్ సుమీత్ సభర్వాల్ ATCకి “మేడే… మేడే…” అని డిస్ట్రెస్ కాల్ పంపాడు. మళ్లీ సంప్రదించేలోపే… విమానాన్ని కంట్రోల్ చేయలేకపోయాడు. అదే సమయంలో, ప్రయాణికులతో నిండిన బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్… కాలేజీ హాస్టల్ భవనాన్ని ఢీకొట్టి పెద్ద మంటల్లో కరిగిపోయింది. ఈ ప్రాంతం, మెధనీనగర్ — విమానాశ్రయం నుంచి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంది.విమాన ప్రమాదానికి సంబంధించి విమానయాన శాఖ కార్యదర్శి ఎస్కే సిన్హా మాట్లాడుతూ – “ప్లేన్ టేకాఫ్ అయిన 1.39కు మేం చివరిసారిగా సిగ్నల్ అందుకున్నాం. దాని తరువాత సంబంధం కోల్పోయాం. విమానం ‘ఫుల్ ఎమర్జెన్సీ’ ప్రకటించింది. కానీ కేవలం నిమిషం వ్యవధిలోనే అది కూలిపోయింది” అని తెలిపారు.
విమానం ఇదే రోజు ప్యారిస్–ఢిల్లీ–అహ్మదాబాద్ రూట్ను పూర్తి చేసింది. దీంతో ముందు నుంచి ఏదైనా సాంకేతిక లోపం ఉందా? అనే అనుమానాలు తెరపైకి వచ్చాయి. అయితే ఇప్పటివరకు దాని నిర్ధారణ కాలేదు. ప్రస్తుతం బ్లాక్బాక్స్ లభ్యమైందని, దాని విశ్లేషణతో అసలైన కారణం బయటపడనుందని అధికారులు చెప్పారు. అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్కు తరలించిన మృతదేహాల పరిస్థితి దయనీయంగా ఉందని వైద్యులు తెలిపారు. వేడి గాలులతో పాటు మంటల్లో చిక్కుకున్న మృతదేహాలను గుర్తించడం కూడా ఒక కష్టతర ప్రక్రియగా మారింది. ప్రాంతం నిండా శిధిలాలు, మంటల ముద్రలు, బాధితుల అరుపులు చుట్టూ ప్రతిధ్వనిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇది 2010 మంగళూరులో జరిగిన విమాన ప్రమాదం తర్వాత భారత్ చరిత్రలో అతిపెద్ద విమాన దుర్ఘటనగా నమోదైంది. అప్పుడు 158 మంది మరణించగా, ఈసారి ఆ సంఖ్య దాటిపోయింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా విషాదాన్ని వ్యక్తం చేస్తూ, ప్రధానమంత్రి కార్యాలయం స్పందన తెలిపింది. బాధిత కుటుంబాలకు పూర్తి సహాయం అందించబడుతుందని హామీ ఇచ్చారు.





