వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009ని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ప్రభుత్వ ధృవపత్రాలు, పౌర సేవలను వాట్సాప్ ద్వారా అందుబాటులోకి తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్లో పౌర సేవలను మరింత వేగంగా, పారదర్శకంగా అందించేందుకు ప్రభుత్వం కొత్త ప్రయోగాన్ని ప్రారంభించింది. ఇకపై ప్రభుత్వ ధృవపత్రాలు, పౌర సేవలు వాట్సాప్ (WhatsApp Governance) ద్వారా ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఈ సేవలను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009ను ప్రకటించారు. దేశంలోనే తొలిసారి ఈ తరహా సేవలు అందించడం విశేషం. దీని ద్వారా దేవాదాయ, విద్యుత్, రెవెన్యూ, మున్సిపల్, ఆర్టీసీ, అన్న క్యాంటీన్, సీఎంఆర్ఎఫ్ వంటి శాఖలకు సంబంధించిన సేవలు పొందవచ్చు.
ఏయే సేవలు అందుబాటులోకి రానున్నాయి?
ఈ వాట్సాప్ సేవల ద్వారా ముఖ్యంగా దేవాలయ దర్శన టికెట్లు, గదుల బుకింగ్, డోనేషన్లు (Temple Services), ల్యాండ్ రికార్డులు, రెవెన్యూ దస్తావేజులు (Revenue Documents), జనన మరణ ధృవీకరణ పత్రాలు, ఆస్తిపన్ను చెల్లింపులు (Property Tax Payments), ట్రేడ్ లైసెన్సులు వంటి సేవలు అందించనున్నారు. ఫోరెన్సిక్ మరియు సైబర్ సెక్యూరిటీ పరంగా ఈ సేవల భద్రతపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా నేరుగా మొబైల్ ద్వారా సేవలు పొందే అవకాశం కల్పించడమే ఈ కొత్త విధానం లక్ష్యం.






