సమర్థ నాయకత్వం ఉంటేనే అభివృద్ధి సాధ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అన్నారు. ఆయన అధ్యక్షతన సచివాలయంలో మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, పాలనలో ఎదురయ్యే సవాళ్లపై ముఖ్యమంత్రి అధికారులకు సూచనలు చేశారు.
‘‘వృద్ధి రేటు పెంచాలి, పాలనా వ్యవస్థ గాడిలో పెట్టాలి’’
‘‘గత ఐదేళ్ల విధ్వంసం వల్ల రాష్ట్రం వెనుకబడ్డాం. ఒక్కో సమస్యను అధిగమిస్తూ ముందుకు సాగుతున్నాం. ఆరు నెలల పాలనలో 12.94% వృద్ధి రేటు సాధించాం. ఫైళ్ల పరిశీలన వేగంగా జరగాలి. వచ్చిన సమస్యలపై తక్షణ నిర్ణయాలు తీసుకోవాలి. పాలనా వ్యవస్థ మెరుగుపడాలని మాత్రమే నా ఆశ. ఇదేదో కొంతమందిని ఎత్తిచూపడం కాదు. ప్రజలు మనపై విశ్వాసం ఉంచి మద్దతిచ్చారు. ఆ విశ్వాసాన్ని నిలబెట్టేలా పనిచేయాలి’’ అని చంద్రబాబు తెలిపారు. ‘‘ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడల్లా కొన్ని సవాళ్లు తప్పవు. కానీ, ఈసారి తలపెట్టిన ప్రతిదీ సవాలుగా మారింది. ఇప్పటివరకు ఏడు శ్వేతపత్రాలు విడుదల చేశాం. నిర్వీర్యమైన వ్యవస్థలను గాడిలో పెట్టేందుకే ప్రజలు మాకు అధికారమిచ్చారు. స్వర్ణాంధ్ర-2047 లక్ష్యంతో 15% వృద్ధి రేటును సాధించాలి. అప్పులు తీర్చాల్సిన అవసరముంది. అదే సమయంలో వనరులు, సిబ్బంది సమర్థంగా పని చేయాలి’’ అని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.





