- లైంగిక వేధింపుల ఆరోపణలు, నిరసన మధ్య ఆత్మహత్యకు ప్రయత్నించిన విద్యార్థిని మృతి.
- కళాశాల ప్రిన్సిపాల్ అరెస్ట్, నేడు భోగోరాయ్ గ్రామంలో విద్యార్థిని అంత్యక్రియలు జరుగుతాయి.
బాలేశ్వర్లోని ఎఫ్ఎం అటానమస్ కళాశాల BEd విద్యార్థిని (20) సోమవారం కాలిన గాయాలతో చనిపోయింది. సీనియర్ ఫ్యాకల్టీ సభ్యుడు లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ నిరసన సమయంలో ఆత్మహత్య ప్రయత్నం చేసిన కొన్ని రోజుల తర్వాత ఈ ఘటన జరిగింది. ఈ సంఘటన ఒడిశాలో పెద్ద సంచలనం సృష్టించింది.
ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి మంగళవారం ఈ విద్యార్థిని మరణాన్ని అధికారికంగా ధ్రువీకరించారు. కళాశాల సీనియర్ ఫ్యాకల్టీ సభ్యుడు లైంగికంగా వేధిస్తున్నాడని, కళాశాల యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ జులై 12న ఈ విద్యార్థిని ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ఆమె మరణం తర్వాత, భువనేశ్వర్లోని ఎయిమ్స్లో పోస్ట్మార్టం నిర్వహించారు. ఆమె మృతదేహాన్ని బాలేశ్వర్ భోగోరాయ్ స్వగ్రామానికి పంపించారు. బంధువులు స్నేహితులు ఆమెకు వీడ్కోలు పలకడానికి గ్రామంలో గుమిగూడారు. గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
ఘటన వివరాలు దర్యాప్తు పురోగతి
90% కాలిన గాయాలతో ఆ విద్యార్థిని ఎయిమ్స్ భువనేశ్వర్లో చికిత్స తీసుకుంటుంది. మెకానికల్ వెంటిలేషన్ మీద ఉంచి, కిడ్నీ చికిత్సతో సహా నిరంతరం రెస్క్యూ ప్రయత్నాలు చేసినా, జులై 14 రాత్రి 11:46 గంటలకు ఆమెను వైద్యులు మృతి చెందినట్లు ప్రకటించారు. జులై 1 నుంచి జరుగుతున్న నిరసన సమయంలో విద్యార్థిని కళాశాల గేటు బయట నిప్పంటించుకుంది. విద్యార్థులు శాంతియుతంగా ప్రదర్శనలు నిర్వహించారు. విద్యార్థిని విద్య విభాగం అధిపతిపై పదేపదే వేధింపులు, విద్యాపరమైన అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించింది.
ఆత్మహత్యాయత్నానికి ముందు, ఆ విద్యార్థిని కళాశాల యాజమాన్యానికి పలు రాతపూర్వక ఫిర్యాదులు చేసింది. తనను ఫెయిల్ చేస్తానని ఫ్యాకల్టీ సభ్యుడు బెదిరించారని ఆమె చెప్పింది. అయినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ ఘటనలో ఆ అమ్మాయిని కాపాడటానికి ప్రయత్నించిన ఒక పురుష విద్యార్థికి కూడా కాలిన గాయాలు అయ్యాయి. సీసీటీవీలో రికార్డ్ అయిన ఈ భయానక ఘటన, ఒడిశా అంతటా విద్యార్థులు, మహిళా సంఘాలు, రాజకీయ నాయకుల మధ్య తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఘటన తర్వాత, ప్రాథమిక దర్యాప్తులో అసభ్య ప్రవర్తనకు ఆధారాలు లభించడంతో అసిస్టెంట్ ప్రొఫెసర్ను అరెస్ట్ చేశారు. సకాలంలో సరైన చర్యలు తీసుకోనందుకు కళాశాల ప్రిన్సిపాల్ను కూడా సస్పెండ్ చేశారు. సోమవారం ప్రిన్సిపాల్ను అరెస్ట్ చేశారు.
ఒడిశా ఉన్నత విద్యా శాఖ కళాశాల నిర్లక్ష్యాన్ని స్పష్టంగా తెలిపింది. బాధితురాలి ఆరోపణలకు సరైన విధంగా స్పందించనందుకు, ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను సరిగా నిర్వహించనందుకు ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేశారు. మంగళవారం ఉదయం భువనేశ్వర్లోని ఎయిమ్స్ బయట కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు చేశారు. న్యాయం జరపాలని డిమాండ్ చేశారు. నిరసనకారులను తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా ప్రజా ఆగ్రహాన్ని రేకెత్తిస్తుంది.





