బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు తీవ్రస్థాయికి చేరాయి. పార్టీ సీనియర్ నేతలైన హరీశ్రావు, సంతోష్ కుమార్లపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు పార్టీ అధిష్ఠానాన్ని కలవరపెడుతున్నాయి. ఈ వ్యాఖ్యలను అధినేత కేసీఆర్ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సమాచారం. దీనిపై ఆయన కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కేసీఆర్ యోచిస్తున్నారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దీనిపై అధికారిక ప్రకటన రెండు రోజుల్లో వెలువడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
కవిత మీడియా సమావేశం తర్వాత కేసీఆర్ తన ఎర్రవల్లి ఫామ్హౌస్లో కీలక నేతలతో అత్యవసర భేటీ నిర్వహించారు. ఈ సమావేశానికి కేటీఆర్తో పాటు పలువురు సీనియర్లు హాజరయ్యారు. కవితను పార్టీలో కొనసాగిస్తే ప్రతిపక్షాలకు కొత్త ఆయుధం ఇచ్చినట్లు అవుతుందని, అది పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తుందని మెజారిటీ నేతలు కేసీఆర్కు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. కవితపై వెంటనే చర్యలు తీసుకోవాలని, లేకపోతే భవిష్యత్తులో పార్టీకి మరిన్ని ఇబ్బందులు తలెత్తుతాయని వారు స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది.
కవితను దూరం పెడుతున్న పార్టీ శ్రేణులు
ఈ పరిణామాల నడుమ పార్టీ యంత్రాంగం ఇప్పటికే కవితను దూరం పెట్టే పనిలో పడింది. సోషల్ మీడియాలో కవితను అన్ఫాలో చేయాలని పార్టీ కార్యకర్తలకు ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, పలువురు నేతలు టీవీ చర్చల్లో ఆమె వైఖరిని బహిరంగంగా తప్పుబడుతున్నారు. మరికొందరు ఆమెను వెంటనే పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
సస్పెన్షన్ తర్వాత కవిత అడుగులు ఎలా ఉండవచ్చు?
కవితపై సస్పెన్షన్ వేటు పడితే, ఆమె తదుపరి రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర చర్చ జరుగుతోంది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఆమె సొంతంగా ఒక పార్టీ పెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే కొంతకాలంగా బలోపేతం చేస్తున్న ‘తెలంగాణ జాగృతి’ సంస్థను రాజకీయ పార్టీగా మార్చే ప్రయత్నం చేయవచ్చని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఒకవేళ కొత్త పార్టీ పెడితే, దానికి ‘తెలంగాణ జాగృతి’ అనే పేరును ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇదే సమయంలో హరీశ్రావుకు మద్దతుగా బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం ప్రత్యేక పోస్టులు పెట్టడం కూడా గమనార్హం.





