- ప్రేమించాలంటూ వేధింపు, బెదిరింపులతో యువతి మనస్తాపం
- ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట పంచాయతీ వడ్లపల్లిలో ఓ యువతి ఆకతాయిల వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. గంజి నాగ దీప్తి (19) అనే యువతి ఏలూరు కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్లో బీటెక్ రెండో సంవత్సరం చదువుతోంది. కాలేజీకి వెళ్లే మార్గంలో కొంతకాలంగా కొందరు యువకులు ఆమెను వేధిస్తూ, ప్రేమించాలని ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. ప్రేమించకపోతే కుటుంబ సభ్యులను చంపేస్తామంటూ బెదిరించడంతో, దీప్తి అన్నయ్య అరవింద్ వారిని నిలదీశాడు. దీంతో, ఇటీవల వీరభద్రస్వామి తిరునాళ్ల సందర్భంగా అరవింద్పై ఆ యువకులు దాడి చేసినట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
మరో మారు బెదిరింపు!!
బుధవారం రాత్రి ఆకతాయిల ఫోన్ కాల్ వచ్చిందని, మరోసారి బెదిరింపులకు గురి చేయడంతో దీప్తి తీవ్ర మనస్తాపానికి గురైందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. గురువారం ఉదయం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్కు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లి, అన్నయ్య అరవింద్ ఇంట్లోనే ఉండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. బాధిత కుటుంబం నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తోంది. ఈ ఘటనపై తడికలపూడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.





