- మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా విడుదల తేదీ రేపు అధికారిక ప్రకటన
- జనవరి 12, 2026న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇన్సైడ్ టాక్
- పవర్ఫుల్ అతిథి పాత్రలో వెంకటేష్
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న హిలేరియస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా కోసం సినీ ప్రేమికులు, మెగా అభిమానులు భారీ ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే విడుదలైన ‘మీసాల పిల్ల’, ‘శశిరేఖ’ పాటలు సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలవడంతో, సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
నిర్మాతలు ముందుగా ఈ చిత్రాన్ని సంక్రాంతి 2026 సందర్భంగా విడుదల చేయాలని ప్లాన్ చేశారు. తాజా ఇండస్ట్రీ సమాచారం ప్రకారం, ఈ సినిమా జనవరి 12, 2026న ప్రేక్షకుల ముందుకు రానుందనే ప్లాన్లో మేకర్స్ ఉన్నారు. ఈ విషయంపై రేపు స్టూడియోలో ప్రెస్ మీట్ నిర్వహించి, అధికారిక వివరాలు ప్రకటించనున్నట్లు సినిమా యూనిట్ తెలిపింది.

వెంకటేష్ స్పెషల్ ఎంట్రీ
ఈ సినిమాలో చిరంజీవి సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటిస్తుండగా, కేథరిన్ ట్రెసా కీలక పాత్రలో కనిపించనుందని సమాచారం. సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా విక్టరీ వెంకటేష్ పవర్ఫుల్ అతిథి పాత్రలో మెరవనున్నారు. ఈ ఇద్దరు స్టార్ల కలయిక కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సంగీతం భీమ్స్ సిసిరోలియో అందిస్తుండగా, ఈ చిత్రాన్ని సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.





