- సుపరిపాలన కోసం సూపర్ సిక్స్ పథకాలు అమలు
- మంత్రులకు ర్యాంకుల కేటాయింపు పనితీరును మెరుగుపర్చడమే
ప్రజలు చరిత్రాత్మక తీర్పుతో గెలిపించినందుకు వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం తొలి రోజునుంచే కృషి చేస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. గత పాలనలో విధ్వంసమైన వ్యవస్థలను పునరుద్ధరించేందుకు శాయశక్తులా కష్టపడుతున్నామన్నారు. టీమ్ వర్క్ వల్లే ఉత్తమ ఫలితాలు సాధ్యమవుతాయని, అందుకే పాలనలో వేగం పెంచేందుకు మంత్రులకు ర్యాంకులు కేటాయించినట్లు వెల్లడించారు. పింఛన్ల పెంపు, ఉచిత గ్యాస్, అన్న క్యాంటీన్లతో సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల సాధన ద్వారా అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నామని సీఎం తెలిపారు. ‘‘ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో నేను కూడా నా స్థానాన్ని మెరుగుపరచుకోవాలి. గ్రామ స్థాయిలో చిరు ఉద్యోగి నుంచి సీఎం వరకు అందరూ కష్టపడితేనే రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించగలం’’ అని ఆయన అన్నారు.





