- మార్చి నుంచి మే వరకు సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు
- తీవ్రమైన వడగాలుల ప్రభావం – గర్భిణీలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి
ఆంధ్రప్రదేశ్లో ఈ సంవత్సరం ఎండలు మితిమీరే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ హెచ్చరించారు. మార్చి నెల నుంచే ఉష్ణోగ్రతలు సాధారణాన్ని మించనున్నట్లు, ముఖ్యంగా ఏప్రిల్, మే నెలల్లో మరింత తీవ్రత ఉంటుందని వివరించారు. శ్రీసత్యసాయి, అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల్లో కొన్ని ప్రాంతాలు మినహా మిగిలిన రాష్ట్ర వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఉత్తరాంధ్రలో ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటుందనీ, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా మిగిలిన ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పారు.
“ప్రజలు జాగ్రత్తగా ఉండాలి”
వడగాలులు ముప్పు పొంచి ఉందని హెచ్చరించిన అధికారులు, గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని సూచించారు. ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎండల ప్రభావంపై సమాచారానికి టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101 వినియోగించుకోవాలని సూచించారు.
“భూతాప ప్రభావం – 2025 మరింత వేడిగా?”
గతేడాది 2024, చరిత్రలోనే అత్యంత వేడి సంవత్సరంగా నమోదైంది. ఈ కారణంగా 2025 ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయనే అంశంపై ప్రజల్లో ఆందోళన పెరిగింది. వాతావరణ నిపుణుల అంచనాల ప్రకారం ఈ ఏడాది కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. 1901 నుంచి సేకరించిన వాతావరణ డేటా ప్రకారం, 2024 అత్యంత వేడి సంవత్సరం. గతేడాదితో పోల్చితే ఉష్ణోగ్రతలు సగటున 0.65 డిగ్రీలు పెరిగాయి. 2025 జనవరిలో ఉష్ణోగ్రత 0.94 డిగ్రీల పెరుగుదల నమోదు కాగా, 1958లో 1.17 డిగ్రీలు, 1990లో 0.97 డిగ్రీలు పెరిగినట్లు రికార్డుల ప్రకారం తెలుస్తోంది.





