- కట్నం వేధింపులతో కోడలిని హత్య చేసి, మృతదేహాన్ని ఇంటి బయట గుంతలో పాతిపెట్టిన అత్తమామలు.
- దాదాపు రెండు నెలల పాటు మిస్సింగ్ కేసుగా నమ్మించి, చివరికి గుట్టురట్టయిన వైనం.
ఫరీదాబాద్లో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహిత అదృశ్యం కేసులో ఆమె అత్తమామలే హంతకులని తేలింది. ఫిరోజాబాద్ జిల్లా షికోహాబాద్కు చెందిన తను కుమార్ (24)కు, రోషన్ నగర్కు చెందిన అరుణ్ సింగ్తో రెండేళ్ల క్రితం పెళ్లయింది. కట్నం వేధింపులతో ఆమెను హత్య చేసి, ఇంటి బయట గుంతలో పాతిపెట్టి, ఆ తర్వాత అదృశ్యమైనట్లు నాటకమాడారు. దాదాపు రెండు నెలల పాటు ఈ విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడినప్పటికీ, కూతురి తండ్రి హకీమ్ పట్టుదలతో ఈ ఘోరం బయటపడింది.
ఎలా బయటపడింది ఈ ఘోరం?
తండ్రి హకీమ్ ఆరోపణల ప్రకారం, తన కూతురు కట్నం వేధింపులు తట్టుకోలేక పెళ్లయిన ఏడాది పాటు పుట్టింట్లోనే ఉంది. పంచాయితీ పెద్దల జోక్యంతో ఫరీదాబాద్లోని అత్తవారింటికి తిరిగి వెళ్ళింది. అయినప్పటికీ వేధింపులు ఆగలేదు. తను అదృశ్యమైందని తెలియగానే, హకీమ్ తన మరో కూతురు ప్రీతితో కలిసి అత్తవారింటికి వెళ్ళాడు. అక్కడ ఇంటి బయట కొత్తగా కప్పబడిన గుంతను చూసి అనుమానం వ్యక్తంచేశాడు. అయితే, పోలీసులు అతని ఫిర్యాదును పట్టించుకోలేదు. ఎన్నిసార్లు పోలీసులను ఆశ్రయించినా నిరాదరణే ఎదురైంది. చివరకు, పల్లా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయగా, దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల విచారణలో భాగంగా, ఏప్రిల్ 23న అరుణ్ సింగ్, అతని తండ్రి కలిసి తమ ఇంటి బయట 10 అడుగుల లోతు గుంతను తవ్వించినట్లు, మరుసటి రోజు మేస్త్రీతో పూడ్పించినట్లు తేలింది. ఆ తర్వాత తను మానసిక వికలాంగురాలని చెప్పి మిస్సింగ్ కేసు పెట్టారు.
పోలీసులు శుక్రవారం ఉదయం నాయిబ్ తహసీల్దార్ జస్వంత్ సింగ్ సమక్షంలో గుంతను తవ్వి తను మృతదేహాన్ని వెలికితీశారు. బద్షా ఖాన్ సివిల్ హాస్పిటల్లో పోస్ట్మార్టం తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ కేసులో భూప్ సింగ్ (యూపీలోని మైన్పురి), అతని భార్య సోనియా, కొడుకు అరుణ్ సింగ్, కూతురు కాజల్లపై పల్లా పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేశారు. భూప్ సింగ్, అరుణ్ సింగ్ను పోలీసులు విచారిస్తున్నారు. మిగిలిన నిందితులను పట్టుకోవడానికి దాడులు నిర్వహిస్తున్నట్లు ఫరీదాబాద్ పోలీస్ ప్రతినిధి తెలిపారు.





