పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం యువకుడు బొల్లా రవితేజ దారుణ హత్యకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాడేపల్లిగూడెం ఆరో వార్డుకు చెందిన రవితేజ (28) హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. నూతన సంవత్సర వేడుకల కోసం రవితేజ తన స్నేహితులతో కలిసి గోవా వెళ్లారు. సోమవారం రాత్రి కలంగుట్ బీచ్లో సరదాగా గడిపిన అనంతరం భోజనానికి మరీనా బీచ్షాక్ రెస్టారెంట్కి వెళ్లారు.
అక్కడ బిల్లులో అధిక ధరలు చూసి ఓ యువతి నిర్వహకుడిని ప్రశ్నించడంతో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో రెస్టారెంట్ యజమాని కుమారుడు సుబెట్ సిల్వేరా అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఘర్షణ చెలరేగింది. దాంతో రెస్టారెంట్ సిబ్బంది రవితేజపై కర్రలతో దాడి చేశారు. తలకు తీవ్ర గాయాలవడంతో రవితేజ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆయన మృతదేహాన్ని స్వస్థలానికి తరలించేందుకు ఇబ్బందులు తలెత్తడంతో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి తెప్పించింది. అక్కడి నుంచి తాడేపల్లిగూడెం నివాసానికి మృతదేహం తరలించారు.





