- 2027లో నిర్వహించే గోదావరి పుష్కరాల తేదీలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది
- జూన్ 26 నుంచి జూలై 7 వరకు మొత్తం 12 రోజుల పాటు ఈ పుష్కరాలు
- టీటీడీ సిద్ధాంతి సలహా ఆధారంగా తేదీల నిర్ణయం.
గోదావరి పుష్కరాలు-2027 నిర్వహణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు శుభవార్త చెబుతూ, 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు మొత్తం 12 రోజుల పాటు పుష్కరాలను నిర్వహించనున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. తిరుమల జ్యోతిష్య సిద్ధాంతి తంగిరాల వెంకట కృష్ణ పూర్ణ ప్రసాద్ అందించిన పండితాభిప్రాయాన్ని ఆధారంగా చేసుకుని ఈ తేదీలను ప్రభుత్వం ఖరారు చేసింది. దీనికి అనుగుణంగా దేవాదాయ శాఖ ఎక్స్ ఆఫిషియో సెక్రటరీ డా. ఎం. హరి జవహర్లాల్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. గోదావరి పుష్కరాల తేదీల ఖరారుకు సంబంధించిన ప్రత్యేక నోటిఫికేషన్ను ఆంధ్రప్రదేశ్ గెజిట్లో విడుదల చేయనున్నారు.

త్వరలో ఏర్పాట్ల కార్యాచరణ
పుష్కరాలకు ఇంకా సుమారు సంవత్సరంన్నర సమయం ఉన్నప్పటికీ, ఏర్పాట్లను ముందుగానే ప్రారంభించేందుకు వీలుగా ప్రభుత్వం ముందస్తుగా తేదీలను ప్రకటించడం గమనార్హం. ఈ ప్రకటనతో తూర్పుగోదావరి జిల్లా సహా గోదావరి పరివాహక ప్రాంతాల్లో పుష్కరాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లపై త్వరలోనే కార్యాచరణ ప్రారంభం కానుంది. మౌలిక సదుపాయాల అభివృద్ధి, భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, భక్తుల వసతి వంటి అంశాలపై సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేసుకునేందుకు ఈ ముందస్తు ప్రకటన అధికారులకు స్పష్టతనిచ్చింది. లక్షలాది మంది భక్తులు పాల్గొనే ఈ మహా పండుగ నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అధికారులు తెలిపారు.





