చెంచురాజు కండ్రిగ: గుకేశ్ స్వస్థలం.. అక్కడ సంబరాలు షురూ!!

ప్రపంచ చెస్‌ ఆటలో భారతదేశానికి మరో బంగారు పతకం అందించిన దొమ్మరాజు గుకేశ్‌ విజయం తెలుగు రాష్ట్రాలను ఉత్సాహంతో నింపింది. 18 ఏళ్ల వయసులోనే ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి, చరిత్ర సృష్టించిన గుకేశ్‌ విజయానికి రాష్ట్రపతి, ప్రధానమంత్రితో పాటు పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గుకేశ్‌ను తెలుగోడిగా అభివర్ణించారు.

గుకేశ్‌ పుట్టి పెరిగింది చెన్నైలో అయినప్పటికీ, అతని మూలాలు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవి. అతని తాత శంకర్‌రాజు స్వస్థలం తిరుపతి జిల్లాలోని సత్యవేడు సమీపంలోని పిచ్చాటూరు మండలం చెంచురాజు కండ్రిగ అనే గ్రామం. రైల్వే ఉద్యోగిగా చెన్నై వెళ్లి స్థిరపడిన శంకర్‌రాజు కుమారుడు రజనీకాంత్‌ అక్కడే డాక్టర్‌గా స్థిరపడి, పద్మావతిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు జన్మించిన కుమారుడే గుకేశ్‌. గుకేశ్‌ విజయం వార్త తెలియగానే అతని స్వగ్రామం చెంచురాజు కండ్రిగలో సంబరాలు జరిగాయి. గుకేశ్‌ తాతకు అక్కడ ఇల్లు, పొలం, రైసు మిల్‌ ఉండటంతో గ్రామస్థులకు గుకేశ్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. గుకేశ్‌ విజయం గ్రామానికి ఎంతో గర్వకారణమని గ్రామస్థులు తెలిపారు.

తెలుగు తేజం
గుకేశ్‌ విజయం తెలుగు రాష్ట్రాల ప్రతిష్టను పెంచిందని, తెలుగు వారిలో చెస్‌ ప్రతిభ ఎంతో ఉందని ఈ విజయం నిరూపించిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుకేశ్‌ను తెలుగు అబ్బాయిగా అభివర్ణిస్తూ, అతని అద్భుతమైన విజయం దేశం మొత్తం ఆస్వాదిస్తోందని పేర్కొన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా గుకేశ్‌ను చూసి తమిళనాడు గర్విస్తోందని పేర్కొంటూ, అతని విజయం భారతదేశానికి చెందిన గొప్ప చెస్ వారసత్వాన్ని కొనసాగిస్తుందని అన్నారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *