- ‘క్రిష్ 4’ సినిమాతో దర్శకుడిగా మారనున్న హృతిక్ రోషన్.
- సినిమాలో త్రిపాత్రాభినయంలో హృతిక్ కనిపించనున్నట్లు సమాచారం.
హీరోగా విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తున్న స్టార్ హీరో హృతిక్ రోషన్ దర్శకుడిగా మారనున్న విషయం తెలిసిందే. ఆయన ‘క్రిష్ 4’ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. తాజాగా దీనిపై ఓ ఈవెంట్లో మాట్లాడుతూ, దర్శకత్వం వహించడం తనకు ఎంతో భయంగా ఉందని హృతిక్ తెలిపారు. “నాకు దర్శకత్వంపై మొదటి నుంచి ఆసక్తి ఉంది. కానీ, ఇప్పుడు భయపడుతున్నాను. మళ్లీ కొత్తగా స్కూల్కు వెళ్తున్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ఇది నాకు పూర్తి భిన్నమైన రంగం. దర్శకుడు అంటే ఎన్నో సవాళ్లు ఉంటాయి. ఎన్నో పరిశోధనలు చేయాలి. భవిష్యత్తులో ఎందుకు దీన్ని ఎంచుకున్నానా అని కూడా అనిపిస్తుంది. ఇలాంటివి ఎన్నో ఎదుర్కోవాలి. అన్నిటికీ సిద్ధపడే దర్శకుడిగా అడుగులు వేస్తున్నా. ఎప్పుడూ మీ ప్రేమను గుర్తుంచుకుంటాను” అని హృతిక్ చెప్పారు.
త్రిపాత్రాభినయంలో హృతిక్!
హృతిక్ ఈ సినిమాను ప్రకటించిన నాటి నుంచి దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో హృతిక్ త్రిపాత్రాభినయంలో కనిపించనున్నట్లు సమాచారం. హీరో పాత్రతో పాటు విలన్గానూ కనిపించనున్నారట. బాలీవుడ్లోని అగ్ర నటీనటులు ఇందులో భాగం కానున్నట్లు తెలుస్తోంది. ప్రీతి జింటా, ప్రియాంక చోప్రా, వివేక్ ఒబెరాయ్, రేఖ ఇందులో నటించనున్నట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అలాగే, ఓ కీలక పాత్రలో నోరా ఫతేహి కనిపించనున్నట్లు సమాచారం.





