‘‘ఐటీ ఉద్యోగులను తక్కువ చేసి చూడటం తగదు. ప్రతిభ, విద్య, అంకితభావం కలగలిసిన ఈ రంగాన్ని ఎవరూ తక్కువగా అంచనా వేయలేరు’’ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. గురువారం ఆయన తన ‘ఎక్స్’ ఖాతాలో చేసిన పోస్ట్ వైరల్గా మారింది. ఐటీ రంగంపై వ్యంగ్య వ్యాఖ్యలు చేసే వారిపై మండిపడిన కేటీఆర్, ఐటీ రంగం అభివృద్ధి దేశానికి కీలకమని వివరించారు.
‘‘విద్య, ప్రతిభతో సమానమయ్యే వారు రాజకీయాల్లో అరుదు’’
‘‘ఐటీ రంగంలో పనిచేయాలంటే నిజమైన ప్రతిభ, విద్య, అంకితభావం అవసరం. కానీ, కొందరు యాక్సిడెంటల్ రాజకీయ నాయకులు సమర్థత లేకుండానే సంచులకొద్దీ డబ్బులతో రాజకీయాలను నడిపించగలుగుతున్నారు. అలాంటి అనాలోచిత నాయకత్వానికి మనం భయంకరమైన మూల్యం చెల్లిస్తున్నాం’’ అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఐటీ రంగంలో ఉన్న వారికి సలాం చెబుతూ, వారికి ఉండే విద్యార్హతలు, నిబద్ధతకు రాజకీయాల్లో కొందరు సరితూగలేరని గట్టిగా చెప్పారు.






