దేశవ్యాప్తంగా లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు ఉద్దేశించిన ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ ప్రణాళికపై కీలక అడుగు పడింది. ఈ మేరకు 129వ రాజ్యాంగ సవరణ బిల్లు సహా మరో బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్ మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టారు. బిల్లును ప్రవేశపెట్టడంపై మొదటి నుంచే విపక్షాలు కంగ్రస్, టీఎంసీ, సమాజ్వాదీ పార్టీలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశాయి. మరోవైపు, ఎన్డీయే మిత్ర పక్షాలు, ముఖ్యంగా తెదేపా భేషరతుగా మద్దతు ప్రకటించాయి.
సభలో బిల్లును ప్రవేశపెట్టేందుకు జరిగిన ఓటింగ్లో 269 మంది ఎంపీలు అనుకూలంగా ఓటేసినప్పటికీ 198 మంది వ్యతిరేకత ప్రకటించారు. హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన ఈ ఓటింగ్లో కొందరు ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఓటు వేయగా, మరికొందరు బ్యాలెట్ ద్వారా తమ అభిప్రాయం వెల్లడించారు.
తెదేపా ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, ‘‘జమిలి ఎన్నికలు ఖర్చు తగ్గించడమే కాకుండా పాలనా సామర్థ్యాన్ని పెంచుతాయి. రూ.లక్ష కోట్లు దాటుతున్న ఎన్నికల ఖర్చును అదుపు చేస్తాయి. నిరంతర ఎన్నికల కారణంగా అభివృద్ధికి ఏర్పడుతున్న ఆటంకాలు తొలగుతాయి’’ అని తెలిపారు.
జమిలి ఎన్నికల బిల్లు అమలుపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తున్నా, పార్లమెంట్లో ప్రవేశపెట్టడంతో పలు రాష్ట్రాల్లో దానికి మద్దతు, వ్యతిరేకత మధ్య తీవ్ర వాదోపవాదాలు నెలకొన్నాయి.






