- సాక్షి ఛానెల్ డిబేట్లో వ్యాఖ్యల నేపథ్యంలో తుళ్లూరు పోలీసులు అరెస్టు
- అక్రమ అరెస్టుగా అభిప్రాయపడిన సుప్రీం కోర్టు వెంటనే బెయిల్ మంజూరు
సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు సోమవారం సాయంత్రం గుంటూరు జైలు నుంచి విడుదలయ్యారు. అమరావతి మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో, గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అయితే, ఈ కేసు చట్టవిరుద్ధమంటూ దాఖలైన పిటిషన్పై జూన్ 13న సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది.
‘‘నవ్వినందుకు అరెస్ట్ చేస్తారా?’’ – సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
విచారణలో జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ మన్మోహన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం స్పష్టంగా స్పందించింది. ‘‘ఒక టీవీ డిబేట్లో నవ్వినంత మాత్రానా అరెస్ట్ చేస్తారా? అలాంటివి మేమూ విచారణల సమయంలో నవ్వుతుంటాం. వాక్ స్వాతంత్రాన్ని రక్షించాలి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. విశ్లేషకుడు చేసిన వ్యాఖ్యలకు కొమ్మినేనితో సంబంధం ఏంటి?’’ అని కోర్టు ప్రశ్నించింది. వెంటనే బెయిల్ మంజూరు చేస్తూ, ఆయనను విడుదల చేయాలని ఆదేశించింది.





