మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (91) గురువారం రాత్రి దిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మృతితో దేశవ్యాప్తంగా ప్రజలు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మరణం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 7 రోజులపాటు సంతాప దినాలు నిర్వహించాలని నిర్ణయించింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు కేంద్ర మంత్రివర్గం సమావేశమై, ఆయన మృతికి సంతాపం తెలియజేయనుంది.
1991 నుండి 1996 వరకు పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్, భారతదేశ ఆర్థిక సంస్కరణల్లో కీలక పాత్ర పోషించారు. 2004 నుండి 2014 వరకు భారత ప్రధానిగా ఉన్న ఆయన, దేశానికి సేవలందించిన ప్రముఖ నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆయన పాలనలో భారత ఆర్థిక వ్యవస్థకు మంచి మార్గదర్శకత్వం లభించింది. భారత రాజకీయాల్లో ఒక గొప్ప నాయకుడిని కోల్పోవడం అని పలువురు సంతాపం తెలియజేస్తున్నారు.





