- గిగ్ వర్కర్ల భద్రత కోసం కొత్త పథకం
- ప్రతి లావాదేవీపై కొంత శాతం పింఛను ఖాతాలోకి
దేశవ్యాప్తంగా వివిధ ఆన్లైన్ వేదికల్లో పనిచేస్తున్న కోటికి పైగా గిగ్ వర్కర్ల భవిష్యత్తు భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీరి కోసం ప్రత్యేక పింఛను పథకాన్ని అమలు చేసేందుకు మోదీ సర్కారు సిద్ధమవుతోంది. త్వరలోనే ఈ ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ పరిశీలనకు పంపనుందని కార్మిక శాఖ వర్గాలు తెలిపాయి. గిగ్ వర్కర్లు విధి నిర్వహణలో చేసే ప్రతి లావాదేవీ నుంచీ ‘సామాజిక భద్రతా చెల్లింపు’ కింద కొంత మొత్తం ప్రత్యేక ఖాతాలో జమవుతుందని తెలుస్తోంది. స్విగ్గీ, ఓలా, జొమాటో, అమెజాన్ లాంటి వేదికల ద్వారా తాత్కాలిక ఉద్యోగాలు చేసే వారిని గిగ్ వర్కర్లుగా పరిగణిస్తారు. వీరికి నెలవారీ వేతనం లేకపోవడం, ఆదాయం నిలకడగా లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రతి లావాదేవీపై నిర్దిష్ట శాతం సేవింగ్ను పింఛను ఖాతాలోకి జమ చేయనుంది. ఇది జీఎస్టీ మాదిరిగా ఆన్లైన్ సంస్థల ద్వారా స్వీకరించనుంది.
పింఛను విత్డ్రాకు రెండు ఎంపికలు
- పదవీ విరమణ సమయంలో పింఛను ఖాతాలో ఉన్న మొత్తంపై వడ్డీని విత్డ్రా చేసుకోవచ్చు.
- లేదా, ఖాతాలో ఉన్న మొత్తాన్ని ఈఎంఐలుగా పొందే అవకాశముంది.
ఈ-శ్రమ్ పోర్టల్ ద్వారా మరిన్ని ప్రయోజనాలు
గిగ్ వర్కర్లను గుర్తించేందుకు కేంద్రం ‘ఈ-శ్రమ్’ పోర్టల్ను రూపొందించింది. ఇప్పటికే 30 కోట్లకు పైగా కార్మికులు దీని ద్వారా నమోదు చేసుకున్నారు. వీరికి ప్రత్యేక గుర్తింపు కార్డులు, ‘ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన’ ద్వారా ఆరోగ్య భద్రత, ఇతర సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందుబాటులోకి రానున్నాయి.





