- ఆదివారం మాండలే సమీపంలో 5.1 తీవ్రతతో ప్రకంపనలు
- భారీ భూకంప ధాటికి మృతుల సంఖ్య పెరిగే అవకాశమంటున్న అధికారులు
మయన్మార్లో భూకంపాల ఆగమాసపు పరిస్థితే నెలకొంది. ఆదివారం దేశంలోని రెండో అతిపెద్ద నగరమైన మాండలే సమీపంలో 5.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సహాయక బృందాలు వెంటనే రంగంలోకి దిగి, భవన శిథిలాల్లో చిక్కుకున్నవారి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే శుక్రవారం జరిగిన 7.7 తీవ్రత భూకంప ప్రభావంతో రహదారులు, వంతెనలు, కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడిందని అధికారులు వెల్లడించారు.
శుక్రవారం సంభవించిన భారీ భూకంపంలో ఇప్పటివరకు 1,600 మంది ప్రాణాలు కోల్పోయారు, 3,400 మందికిపైగా గల్లంతయ్యారు. శిథిలాల్లో ఇంకా చాలా మంది ఉండొచ్చని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. శనివారం కూడా 4.3, 3.8, 4.7 తీవ్రతతో వరుస ప్రకంపనలు నమోదయ్యాయి. ఇదే భూకంప ప్రభావం థాయ్లాండ్లోనూ కనిపించింది. బ్యాంకాక్లో నిర్మాణంలో ఉన్న ఒక భారీ భవనం కూలిపోవడంతో 78 మంది కార్మికులు గల్లంతయ్యారు. సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు శక్తిమంతమైన యంత్రాలను ఉపయోగిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.





