నాగచైతన్య నటించిన ‘తండేల్’ విజయంపై నాగార్జున హర్షం వ్యక్తం చేశారు. సినిమా విజయం తమకంటే అభిమానులకు ఎక్కువ ఆనందం కలిగించిందని ఆయన అన్నారు. ఇటీవల జరిగిన ‘తండేల్’ సక్సెస్ మీట్లో మాట్లాడుతూ, మూవీ రిలీజ్ రోజున ప్రధాని మోదీని కలిసేందుకు దిల్లీ వెళ్లిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. “అక్కడ సెక్యూరిటీ మా ఫోన్లు తీసుకున్నారు. విడుదలైన రోజే చైతన్య ముఖంలో ఆనందం ఎలా ఉంటుందో చూడాలని అనుకున్నా, కానీ ఫోన్ కాల్స్, మెసేజ్లు చూస్తుంటే మా అభిమానులు ఎంత ఆనందించారో అర్థమైంది” అని చెప్పారు. ‘తండేల్’ విజయంతో పాటు, అల్లు అరవింద్ గారి నిర్మాణంలో వచ్చిన విజయవంతమైన సినిమాలను నాగార్జున ప్రస్తావించారు. “‘100% లవ్’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’, ‘తండేల్’ – ఇలా మీరు మాకు మూడు విజయాలు అందించారు. చందూ, చైతన్య కాంబినేషన్ అద్భుతం. ‘తండేల్’ ద్వారా చైతన్యలోని నటుడిని కొత్తగా చూపించారు” అని అన్నారు.
ఇది నా జీవితంలో కష్టమైన జర్నీ – నాగచైతన్య
ఈ సినిమా తనకు ఇష్టమైన, కష్టమైన జర్నీ అని నాగచైతన్య తెలిపారు. “కార్తిక్, చందూ ఈ కథ చెప్పగానే నచ్చేసింది. శ్రీకాకుళం వెళ్లి పరిశోధన చేసినపుడు ఇది ఎంత బాధ్యతాయుతమైన పాత్రో అర్థమైంది. ఇలాంటి పాత్రలు అరుదుగా వస్తాయి. విజయం సాధించాలనే నిబద్ధతతో ఈ ప్రయాణం మొదలుపెట్టాం” అని పేర్కొన్నారు.





