సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తన పెద్ద కుమార్తెల గురించి ఆసక్తికర విషయాలను షేర్ చేశారు. తాను వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న “అన్స్టాపబుల్” సీజన్ 4లో, నాటి గుర్తుల్ని నెమరువేసుకుంటూ బాలయ్య పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
మణిరత్నం హీరోయిన్ ఆఫర్
ఎపిసోడ్లో సంగీత దర్శకుడు తమన్ (Thaman S) అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, “మణిరత్నం గారు బ్రాహ్మణిని ఓ సినిమా కోసం హీరోయిన్గా అడిగారు. ఆ విషయం ఆమెకు చెప్పినప్పుడు, బ్రాహ్మణి ‘నా ముఖం!!’ అంటూ సరదాగా స్పందించింది. మణిరత్నం గారు ‘నీ ముఖం కోసమే అడుగుతున్నారు’ అన్నాను. కానీ, చివరకు ఆమె ఆసక్తి లేదని చెప్పి ఆ అవకాశం వదిలేసింది,” అని బాలయ్య చెప్పారు.
తేజస్విని గురించి వ్యాఖ్యలు
తన రెండో కుమార్తె తేజస్విని గురించి మాట్లాడుతూ, “ఆమె అద్దంలో చూసుకుంటూ యాక్టింగ్ ప్రాక్టీస్ చేసేది. తనయిన నటి అవుతుందని అనుకున్నా. చాలా యాక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు ఈ షోకు క్రియేటివ్ కన్సల్టెంట్గా ఉంది. ఇద్దరూ తమ రంగాల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. వాళ్ల తండ్రిని నేను అని చెప్పుకోగల స్థాయికి ఎదిగారు,” అంటూ గర్వం వ్యక్తం చేశారు.
తమన్తో సరదా సంభాషణ
‘‘దేవిశ్రీ ప్రసాద్ ఇష్టమా? నేను ఇష్టమా?’’ అని తమన్ అడిగిన ప్రశ్నకు, బాలయ్య సరదాగా ‘‘తమన్’’ అని బదులిచ్చారు. అలాగే, యాక్టర్ కంటే హోస్ట్గా ఉండడం ఇష్టమని చెప్పారు.
‘డాకు మహారాజ్’పై హైప్
బాలకృష్ణ హీరోగా, బాబీ దర్శకత్వంలో రూపొందిన ‘‘డాకు మహారాజ్’’ మూవీ గురించి కూడా షోలో చర్చించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతున్న ఈ చిత్రానికి నాగవంశీ నిర్మాతగా, తమన్ సంగీత దర్శకుడిగా పని చేశారు. యూఎస్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ను శనివారం నిర్వహించనున్నారు.






