- హడ్సన్ నదిలో కుప్పకూలిన పర్యాటక హెలికాప్టర్.
- జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీ స్పెయిన్ సీఈఓ కుటుంబం దుర్మరణం.
అమెరికాలోని న్యూయార్క్లో గురువారం మధ్యాహ్నం ఓ ఘోర ప్రమాదం జరిగింది. పర్యాటక హెలికాప్టర్ హడ్సన్ నదిలో ప్రమాదవశాత్తు కుప్పకూలడంతో ఓ టెక్ కంపెనీ సీఈఓ, ఆయన కుటుంబ సభ్యులు దుర్మరణం చెందారు. జర్మనీకి చెందిన దిగ్గజ టెక్నాలజీ కంపెనీ సీమెన్స్ స్పెయిన్ సీఈఓ అగస్టన్ ఎస్కోబార్ తన కుటుంబంతో కలిసి న్యూయార్క్ పర్యటనకు వచ్చారు.
నదిలో తలకిందులుగా పడి మంటలు
వారు ప్రయాణిస్తున్న బెల్ 206 పర్యాటక హెలికాప్టర్ హడ్సన్ నది మీదుగా వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. ఒక్కసారిగా గింగిరాలు తిరుగుతూ నదిలో తలకిందులుగా పడిపోయింది. ఆ తర్వాత మంటలు చెలరేగడంతో హెలికాప్టర్లో ఉన్న ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో ఎస్కోబార్, ఆయన భార్య, ముగ్గురు పిల్లలతో పాటు పైలట్ కూడా ఉన్నారు. న్యూయార్క్ హెలికాప్టర్ టూర్స్ విభాగం ఈ హెలికాప్టర్ను పర్యాటకుల కోసం వినియోగిస్తోంది. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది బోట్ల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. హెలికాప్టర్ పూర్తిగా నీళ్లలో మునిగిపోయిందని అధికారులు తెలిపారు. గాల్లో ఉండగానే హెలికాప్టర్లోని ఒక భాగం విరిగిపోయిందని వారు పేర్కొన్నారు. ఈ ప్రమాద దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.





