- ఏప్రిల్ 1, 2025 నుంచి కొత్త టోల్ రేట్లు అమల్లోకి
- 24 గంటలలోపు తిరుగు ప్రయాణంపై 25% మినహాయింపు
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులకు ఎన్హెచ్ఏఐ (NHAI) తీపి కబురు అందించింది. టోల్ చార్జీలను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం ఏప్రిల్ 1, 2025 నుంచి మార్చి 31, 2026 వరకు అమల్లో ఉండనుంది. తెలంగాణలో పంతంగి, కొర్లపహాడ్, ఆంధ్రప్రదేశ్లో చిల్లకల్లు టోల్ప్లాజాల్లో ఈ తగ్గింపు అమలు కానుంది.
తాజా నిర్ణయం ప్రకారం, పంతంగి టోల్ప్లాజా వద్ద కార్లు, జీపులు, వ్యాన్లకు ఒక్క మార్గం టోల్ రూ.15, రీటర్న్ జర్నీకి రూ.30. లైట్ కమర్షియల్ వాహనాలకు ఒక్క మార్గం రూ.25, రీటర్న్ రూ.40. బస్సులు, ట్రక్కులకు ఒక్క మార్గం రూ.50, రీటర్న్ రూ.75గా నిర్ణయించారు. చిల్లకల్లు టోల్ప్లాజాలో అన్ని వాహనాలకు ఒక్క మార్గానికి రూ.5, రీటర్న్ రూ.10 చొప్పున తగ్గించారు. 24 గంటల లోపు తిరుగు ప్రయాణం చేసే వాహనదారులకు 25% టోల్ మినహాయింపు లభిస్తుంది. గతంలో ప్రతీ ఏప్రిల్ 1న టోల్ చార్జీలు పెరిగేవి. అయితే, 2024 జూన్ 31తో జీఎంఆర్ ఒప్పందం ముగియడంతో, టోల్ నిర్వహణను ఎన్హెచ్ఏఐ స్వయంగా చేపట్టింది. దీంతో ఛార్జీలు తగ్గించేందుకు అవకాశం ఏర్పడింది. ఈ నిర్ణయం వాహనదారులకు భారీ ఊరట కలిగించనుంది.





