- పింఛన్ పంపిణీ సమయాన్ని మార్చిన ప్రభుత్వం.
- లబ్ధిదారులకు, సిబ్బందికి సౌకర్యంగా ఉండేలా నిర్ణయం.
ఎన్టీఆర్ భరోసా పథకం కింద ప్రతి నెలా ఒకటో తేదీన జరుగుతున్న సామాజిక భద్రత పింఛన్ల పంపిణీలో ప్రభుత్వం మార్పులు చేసింది. తెల్లవారుజామునే పంపిణీ చేయాలని ఎక్కడా నిబంధనలు లేకపోయినా, చాలా జిల్లాల్లో అధికారులు ఉదయం 4, 5 గంటల నుంచే ప్రారంభిస్తున్నారు. దీంతో ఉద్యోగులు, లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం ఇకపై ఉదయం 7 గంటలకు పంపిణీ ప్రారంభించాలని ఆదేశించింది. ఆ సమయానికి మాత్రమే యాప్ పనిచేసేలా మార్పులు చేసింది.
ఇతర మార్పులు
లబ్ధిదారుల ఇళ్ల నుంచి 300 మీటర్ల కంటే ఎక్కువ దూరంలో పంపిణీ చేస్తే, కారణాలు నమోదు చేయాలి. ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, పాఠశాలలు, కళాశాలల్లో పింఛన్ పంపిణీ చేసినా నమోదుకు అవకాశం కల్పించింది. లబ్ధిదారులకు ప్రభుత్వ సందేశం తెలిపేందుకు 20 సెకన్ల ఆడియోని యాప్లో ప్లే చేయనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో, ఈ మార్పులను మార్చి 1న చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించి, ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తారు.






