- పాస్టర్ ప్రవీణ్ మృతిపై పలు కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు.
- ప్రవీణ్ మృతి ప్రమాదవశాత్తు జరిగిందని పోలీసుల వెల్లడి.
పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. ఈ కేసుపై పలు రకాలుగా దర్యాప్తు చేపట్టినట్లు ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. ప్రవీణ్ మరణం ప్రమాదవశాత్తు జరిగిందని, కుటుంబ సభ్యులు ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రవీణ్ దారిలో పలువురిని కలిశారని, సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించామని తెలిపారు. ప్రవీణ్ హైదరాబాద్, కోదాడ, ఏలూరులలో మద్యం దుకాణాలకు వెళ్లారని, దారిలో మూడుసార్లు చిన్న ప్రమాదాలకు గురయ్యారని పోలీసులు తెలిపారు.
మద్యం ఆనవాళ్లు, వేగంగా ప్రయాణం..
ప్రవీణ్ శరీరంలో మద్యం ఆనవాళ్లు ఉన్నాయని, కీసర టోల్ప్లాజా వద్ద అదుపుతప్పి కింద పడిపోయారని ఎఫ్ఎస్ఎల్ నివేదిక వెల్లడించింది. రామవరప్పాడు జంక్షన్ వద్ద ఆటో డ్రైవర్ ప్రవీణ్ పరిస్థితిని చూశారని, ట్రాఫిక్ ఎస్సై సూచనతో పార్కులో రెండు గంటలు నిద్రపోయారని పోలీసులు తెలిపారు. హెడ్లైట్ పగిలిపోవడంతో రైట్సైడ్ బ్లింకర్ వేసుకుని ప్రయాణించారని, ఏలూరులో మద్యం కొనుగోలు చేశారని, మద్యం దుకాణానికి వచ్చేసరికే ప్రవీణ్ కళ్లజోడు పగిలిపోయిందని పోలీసులు తెలిపారు. కొంతమూరు పైవంతెనపై వేగంగా వెళ్లారని, ప్రమాదం జరిగిన స్థలంలో బుల్లెట్ వాహనం రోడ్డు పక్కకు దూసుకుపోయిందని, బుల్లెట్ను ఏ వాహనం ఢీకొనలేదని ఫోరెన్సిక్ నివేదిక తెలిపింది. రోడ్డు పనులు జరుగుతుండటంతో కంకర రాళ్లు ఉన్నాయని, బుల్లెట్ పైకి ఎగిరి ప్రవీణ్పై పడిందని, ప్రమాదం జరిగినప్పుడు బండి ఫోర్త్గేర్లో ఉందని ఫోరెన్సిక్ నిపుణులు స్పష్టం చేశారు.





