
ఉద్యోగ భవిష్య నిధి (EPF) సంబంధించి వచ్చే ఏడాదిలో కీలక మార్పులు రాబోతున్నాయి. EPF నిధుల ఉపసంహరణ ఇకపై సులభతరం కానుంది, ఎందుకంటే ఏటీఎంల ద్వారా విత్డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది. కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శి సుమితా దావ్రా ఈ విషయాన్ని ఇటీవల ప్రకటించారు. ఏటీఎం ద్వారా నగదు ఉపసంహరణ కోసం ప్రత్యేకంగా పీఎఫ్ కార్డులు తీసుకొస్తారని సమాచారం. వినియోగదారులు తమ బ్యాంక్ అకౌంట్ను అనుసంధానించి, డెబిట్ కార్డు ద్వారా విత్డ్రా చేసుకునే అవకాశం కూడా ఉంది. అయితే, మొత్తం పీఎఫ్ బ్యాలెన్స్లో 50 శాతం వరకు మాత్రమే ఉపసంహరించుకోవడానికి అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. ఈ కొత్త సదుపాయం అత్యవసర సమయాల్లో ఉపయోగపడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆన్లైన్ ప్రక్రియపై అవగాహన లేనివారు ఇప్పటికీ పీఎఫ్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ మార్పు వల్ల ఆ ఇబ్బంది తొలగించబడుతుంది.





