- రాజస్థాన్ రీట్ పరీక్ష రాస్తుండగానే పురిటి నొప్పులతో ఆసుపత్రికి తరలించిన గర్భిణీ
- నార్మల్ డెలివరీతో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ప్రియాంక చౌదరీ
రాజస్థాన్ రాష్ట్రంలోని టోంక్ జిల్లా మల్పురాకు చెందిన ప్రియాంక చౌదరీ నిండు నెలల గర్భిణీ అయినప్పటికీ రాజస్థాన్ ఎలిజిబిలిటీ ఎగ్జామ్ ఫర్ టీచర్స్ (రీట్) పరీక్ష రాయడానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 27న బరోనిలోని ప్రభుత్వ పాఠశాలలో పరీక్ష రాస్తుండగా ఆమెకు అకస్మాత్తుగా పురిటి నొప్పులు వచ్చాయి. ఇది గమనించిన ఎగ్జామ్ సూపరింటెండెంట్ జిల్లా అధికారులకు సమాచారం అందించగా, అధికారులు అంబులెన్స్ ఏర్పాటు చేసి ఆమెను టోంక్ జిల్లా సాదత్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ప్రియాంక నార్మల్ డెలివరీ ద్వారా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. అయితే పరీక్ష పూర్తిగా రాయలేకపోయినందుకు ప్రియాంక కాస్త నిరాశ చెందిందని ఆమె భర్త జీత్రమ్ చౌదరీ తెలిపారు.
చదువు పై అభిమానం – ప్రశంసలు వెల్లువ
గర్భిణీ అయినప్పటికీ ఎగ్జామ్ రాయడానికి ప్రియాంక చేసిన ప్రయత్నం ఆమెపై ప్రశంసలు కురిపించాయి. చదువు, కెరీర్పై ఆమెకున్న నిబద్ధత నెటిజన్లను, అధికారులు, విద్యార్థులను ఆకట్టుకుంది. ప్రియాంక ఆత్మవిశ్వాసం గురించి ఇప్పుడు రాజస్థాన్ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.





