- పులివెందుల, ఒంటిమిట్టలో జడ్పీటీసీ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.
- ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కడప ఎంపీ అవినాష్రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.
- తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి, వైకాపాకు ఇది ప్రతిష్టాత్మకమైన పోరు.
వైఎస్ఆర్ జిల్లా పులివెందుల, ఒంటిమిట్టలలో జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతున్న సమయంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కడప ఎంపీ అవినాష్రెడ్డిని పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూసేందుకు ఈ చర్య తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఎంపీ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అరెస్టును వ్యతిరేకిస్తూ ఆయన ఇంట్లోనే నిరసన తెలిపారు. అనంతరం వైకాపా శ్రేణులను అక్కడి నుంచి పంపి, పోలీసులు ఆయనను అరెస్టు చేశారు.

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రాతినిధ్యం వహించే ప్రాంతం ఇది. పులివెందుల జడ్పీటీసీ స్థానంలో 11 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి, వైకాపా అభ్యర్థి హేమంత్ రెడ్డి మధ్య ఇక్కడ ప్రధాన పోరు నడుస్తోంది. ఈ ఎన్నికలను కూటమి, వైకాపా పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. అందుకే అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఉపఎన్నికల్లో మొత్తం 10,600 మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు రెండు మండలాల్లో 1500 మంది పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు బ్యాలెట్ విధానంలో పోలింగ్ కొనసాగుతుంది.





