పవిత్ర మహా కుంభమేళాలో మౌని అమావాస్య సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో అనేక మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన త్రివేణి సంగమం వద్ద చోటుచేసుకుంది. తెల్లవారుజామున 2 గంటల సమయంలో, భక్తులు పెద్ద సంఖ్యలో పుణ్యస్నానం చేసేందుకు చేరుకున్నారు. అయితే, రద్దీ కారణంగా గందరగోళం ఏర్పడింది. చీకటిలో కన్పించని చెత్త బుట్టలు కాళ్లకు తగిలి, చాలామంది కింద పడిపోయారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగింది. ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నట్లుగా, మార్గాలు మూసుకుపోవడం వల్ల పరిస్థితి మరింత తీవ్రంగా మారింది.
వెంటనే సహాయక చర్యలు
ఈ ఘటనతో వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అయితే, యూపీ ప్రభుత్వం మృతుల సంఖ్యపై ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. త్రివేణి సంగమం వద్ద కొంతసేపు పుణ్య స్నానాలను నిలిపివేశారు. పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత, పుణ్యస్నానాలు పునరుద్ధరించబడ్డాయి. జనవరి 13న ప్రారంభమైన ఈ మహా కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. 144 సంవత్సరాల తర్వాత జరిగే ఈ మహా కుంభమేళాలో భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగింది.





