తెలుగు సినిమా చరిత్రలో విలక్షణ నటనతో ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తి రాజనాల కాళేశ్వరరావు. 100 ఏళ్ల క్రితం జనవరి 3న జన్మించిన రాజనాల, తెలుగు చిత్రపరిశ్రమలో విలనిజానికి కొత్త నిర్వచనాన్ని ఇచ్చారు. కంటి చూపుతో భయపెట్టే నటన, చిరునవ్వుతో హృదయాలను జయించే అతని ప్రతిభ తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. తన పాఠశాల విద్యను ఇంటి వద్దే పూర్తి చేసిన రాజనాల, రెవెన్యూ శాఖలో ఉద్యోగిగా పనిచేశారు. అయితే, నటనపై ఉన్న ఆసక్తి కారణంగా ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. మద్రాసు వెళ్లి సినీ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. హెచ్.ఎం. రెడ్డి నిర్మించిన ‘ప్రతిజ్ఞ’ (1953) సినిమాలో తొలిసారి నటించి మంచి గుర్తింపు పొందారు. రాజనాల తన కేరియర్లో 400కు పైగా చిత్రాల్లో నటించారు. జానపద, పౌరాణిక, సాంఘిక చిత్రాల్లో అతని పాత్రలు ప్రత్యేకంగా నిలిచాయి. విలన్ పాత్రలు చేసినా, కొన్నిసార్లు సాత్విక పాత్రల్లోనూ మెరిసిన ఆయన నటనకు ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి అగ్రనటుల అభినందనలు పొందారు.
హాలీవుడ్లో తొలి తెలుగు నటుడు
తెలుగు సినిమా పరిధిని దాటి హాలీవుడ్లో కూడా తన ప్రతిభ చాటుకున్న రాజనాల, ‘మాయ’ చిత్రంలో ఇండియన్ నేవీ చీఫ్గా నటించారు. హాలీవుడ్లో నటించిన తొలి తెలుగు నటుడిగా చరిత్రలో నిలిచారు. ఏ భాషలో నటించినా, తన పాత్రలకు స్వయంగా డబ్బింగ్ చెప్పుకునే నైపుణ్యం ఆయన ప్రత్యేకత. తెరపై విలనిజాన్ని ప్రదర్శించినా, తెర వెనుక రాజనాల ఓ మానవతావాది. అనేక మంది అభాగ్యులకు భోజనం పెట్టడం, చిత్రబృందానికి సహాయం చేయడం వంటి పనుల్లో ఆయన ముందుండేవారు. .






