రాష్ట్రంలో నవ దంపతులకు కొత్త రేషన్ కార్డులు జారీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్ల మార్పులు, చేర్పులకూ ఆన్లైన్ పోర్టల్ ద్వారా అవకాశం కల్పించనుంది. కొత్త రేషన్ కార్డులు క్రెడిట్ కార్డు తరహాలో రూపొందించబడి, క్యూఆర్ కోడ్ ద్వారా కుటుంబ సభ్యుల వివరాలను పొందుపరిచే విధంగా ఉంటాయి. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటన ప్రకారం, ఈ ప్రక్రియ జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభమవుతుంది.
రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల కొత్త కార్డులు
ప్రస్తుతం రాష్ట్రంలో 1.48 కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయిని, కొత్త దరఖాస్తుల సంఖ్య సుమారు 70 వేలకు పైగా ఉందని అధికారులు వెల్లడించారు. కుటుంబ సభ్యుల మార్పులు, చేర్పులను కలుపుకొని 2 లక్షల రేషన్ కార్డులు జారీ చేయాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. కొత్త కార్డుల డిజైన్ను క్రెడిట్ కార్డు మాదిరిగా రూపొందించి, క్యూఆర్ కోడ్తో స్కాన్ చేస్తే కుటుంబ వివరాలు కనిపించే విధంగా సౌకర్యం కల్పించారు. గత ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డుల వ్యవస్థపై ఉన్న అసంతృప్తిని దృష్టిలో ఉంచుకుని, కార్డుల రూపురేఖలను పూర్తిగా మారుస్తూ కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.





