ఢిల్లీకి చెందిన తనూ జైన్ తన పట్టుదలతో సాధించిన విజయాలు ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తాయి. డెంటల్ సర్జరీ చదివిన ఆమె, అనంతరం ఐఏఎస్ కావాలని నిర్ణయించుకుంది. మూడు ప్రయత్నాల తర్వాత, 2014లో ఆల్ ఇండియా ర్యాంక్ 648తో తన కలను సాకారం చేసుకుంది. ఏడేళ్ల పాటు సివిల్ సర్వీస్లో వివిధ హోదాల్లో సేవలందించిన తర్వాత, తనకు ఇష్టమైన ఉపాధ్యాయ వృత్తి కోసం ఐఏఎస్ పదవికి రాజీనామా చేసింది.
తనూ జైన్ చెబుతున్నట్టుగా.. “సివిల్ సర్వీసెస్లో చేరడం నా కల. కానీ, ఇక నా జ్ఞానం ద్వారా ఇతరుల కలలు నెరవేరేలా చేయాలనేది ఇప్పుడు నా కొత్త లక్ష్యం.” ఈ ఆలోచనతో ఆమె ‘ఐసీఎస్ తథాస్తు’ అనే యూపీఎస్సీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ను ప్రారంభించింది. ప్రిపరేషన్ స్టాటజీలు, మాక్ ఇంటర్వ్యూలతో పాటు, ప్రేరణాత్మక ప్రసంగాల ద్వారా అనేక మందికి మార్గదర్శకంగా నిలుస్తోంది.
సోషల్మీడియాలో ప్రేరణాత్మక వ్యక్తిత్వం
జైన్ బోధనాపద్ధతులు సోషల్మీడియాలో విశేషంగా ఆదరణ పొందాయి. ఇన్స్టాగ్రామ్లో ఎనిమిది లక్షల ఫాలోవర్లు ఉండటమే దీనికి నిదర్శనం. ప్రిపరేషన్ స్టాటజీలను మెరుగుపరచడంలో, అభ్యర్థులకు వ్యక్తిగత మార్గదర్శకత్వాన్ని అందించడంలో ఆమె దిట్ట. తనూ జైన్ కథ మనకు ఒక స్పష్టమైన సందేశం ఇస్తోంది—కలలు సాకారం చేసుకోవడమే కాదు, ఇతరుల కలలను కూడా ఊపిరిలూదడంలో సంతోషం ఉంటుంది.





