తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 13 నుంచి విదేశాల్లో పర్యటనకు సిద్దమవుతున్నారు. మూడు ప్రధాన దేశాల్లో ఆయన పర్యటనలు జరగనున్నాయి.
ఆస్ట్రేలియా పర్యటన (జనవరి 13-15):
సీఎం రేవంత్ జనవరి 13న ఆస్ట్రేలియా వెళ్లి, క్వీన్స్ల్యాండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని సందర్శించనున్నారు. అక్కడ క్రీడాకారులకు అందిస్తున్న శిక్షణా విధానాలు, మౌలిక సదుపాయాలను పరిశీలిస్తారు. తెలంగాణలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
సింగపూర్ పర్యటన (జనవరి 19-21):
జనవరి 19 నుంచి 21 వరకు సింగపూర్లో సీఎం పర్యటిస్తారు. తెలంగాణ ప్రభుత్వం కొత్త పర్యాటక పాలసీని ప్రవేశపెట్టిన నేపథ్యంలో, పర్యాటక అభివృద్ధికి తీసుకునే చర్యలను అక్కడ పరిశీలిస్తారు. సింగపూర్లో ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేందుకు తీసుకున్న ఆవరణాలు, సౌకర్యాలు ఏ విధంగా ఉంటాయన్నది అధ్యయనం చేస్తారు.
దావోస్ పర్యటన (జనవరి 21-23):
జనవరి 21 నుంచి 23 వరకు స్విట్జర్లాండ్లోని దావోస్లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో సీఎం పాల్గొననున్నారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడులను ఆకర్షించడంపై ప్రముఖ కంపెనీలతో ఒప్పందాలు చేయడమే ఈ పర్యటన లక్ష్యం. సీఎం వెంట పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి డి.శ్రీధర్బాబు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు వెళ్లనున్నారు.






