తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ముగించుకుని శుక్రవారం హైదరాబాద్ చేరుకున్నారు. దుబాయ్ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్కు వచ్చిన ఆయనకు కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. సింగపూర్, దావోస్ పర్యటనలను విజయవంతంగా పూర్తి చేసి భారీ పెట్టుబడులు సమకూర్చారంటూ నేతలు, కార్యకర్తలు ప్రశంసించారు.
రూ.1,78,950 కోట్ల పెట్టుబడులు, 50వేల ఉద్యోగాలు
దావోస్ పర్యటనలో తెలంగాణ ప్రభుత్వం రూ.1,78,950 కోట్ల విలువైన పెట్టుబడులపై 20 సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. గత పర్యటనలో తెచ్చిన రూ.40,232 కోట్ల పెట్టుబడులతో పోలిస్తే ఈసారి నాలుగు రెట్లు అధికంగా పెట్టుబడులు సాధించినట్లు సమాచారం. ఈ తాజా ఒప్పందాలతో రాష్ట్రంలో దాదాపు 50వేల కొత్త ఉద్యోగాలు లభించనున్నాయి. ఈ పర్యటన రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుందని, భారీ పెట్టుబడులు తెలంగాణలో కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి ప్రేరణ కలిగించనున్నాయని సీఎం కార్యాలయం తెలిపింది.






