- 16 ఏళ్లలోపు పిల్లలను అన్ని షోలకు అనుమతించాలని హైకోర్టు ఉత్తర్వులు.
- జనవరి 21న ఇచ్చిన ఉత్తర్వులను సవరించిన న్యాయస్థానం.
తెలంగాణలోని మల్టీప్లెక్స్లకు హైకోర్టు ఊరటనిచ్చింది. 16 ఏళ్లలోపు పిల్లలను అన్ని షోలకు అనుమతించాలని ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 21న ఇచ్చిన ఉత్తర్వులను సవరిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. తదుపరి విచారణను మార్చి 17కు వాయిదా వేసింది. సినిమా టికెట్ల ధరల పెంపు, ప్రత్యేక షోల అనుమతి వ్యవహారంపై దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా జస్టిస్ బి. విజయ్ సేన్రెడ్డి ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. వేళాపాలా లేని షోలకు పిల్లలు వెళ్లడం వల్ల వారి ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పిటిషనర్ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం, రాత్రి 11 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు 16 ఏళ్లలోపు పిల్లలను థియేటర్లలోకి అనుమతించవద్దని ఆదేశించింది.
మల్టీప్లెక్స్ల విజ్ఞప్తి
హైకోర్టు ఉత్తర్వులపై మల్టీప్లెక్స్ల యాజమాన్యం మధ్యంతర పిటిషన్ దాఖలు చేసింది. పిల్లల ప్రవేశంపై ఆంక్షల వల్ల ఆర్థికంగా నష్టపోతున్నామని తెలిపింది. ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు ఆంక్షలు ఎత్తివేయాలని కోరింది. వారి వాదనలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం, గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సవరించింది. ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు 16 ఏళ్లలోపు పిల్లలు థియేటర్లలోకి ప్రవేశించవచ్చని తెలిపింది.






