- చంద్రబాబు ప్రభుత్వ పాలనతో వైఎస్సార్సీపీ హయాన్ని ప్రజలు పోల్చి చూస్తున్నారని వైఎస్ జగన్ వ్యాఖ్య.
- ప్రతిపక్షంలో ఒత్తిడులు, దొంగ కేసులు ఎదురైనా, తిరిగి బలంగా నిలుస్తామన్న విశ్వాసం… తాడేపల్లిలో కీలక సమావేశం
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలో పార్టీ కార్పొరేటర్లు, ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. టీడీపీ ప్రభుత్వ పరిపాలనపై ఘాటుగా స్పందించిన ఆయన, ప్రజల్లో తాము అమలు చేసిన సంక్షేమ పథకాలు ఇప్పటికీ గుర్తుండిపోతున్నాయన్నారు. ‘‘ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించడం ఖాయం’’ అని స్పష్టం చేశారు. ‘‘రాజకీయాల్లో కష్టాలు సహజం. కానీ, ప్రజల నమ్మకంతో మళ్లీ ముందుకు సాగుతాం. నన్ను 16 నెలలు జైల్లో పెట్టినా, తిరిగి ప్రజల ఆశీస్సులతో సీఎం అయ్యా. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది’’ అని జగన్ ఆరోపించారు. ఎన్నికల ముందు ప్రజలకు ఆశలు చూపి ఇప్పుడు చేతులెత్తేశారని మండిపడ్డారు. త్వరలోనే వైఎస్సార్సీపీ తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.





