
జార్జియా దేశంలోని ప్రసిద్ధ స్కై రిసార్ట్ గూడౌరిలో జరిగిన దుర్ఘటన భారతీయ కుటుంబాల్ని విషాదంలో ముంచింది. డిసెంబర్ 14న గూడౌరిలోని హవేలీ అనే భారతీయ రెస్టారెంట్లో జరిగిన ఈ ఘటనలో 12 మంది అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతుల్లో 11 మంది భారతీయులు ఉన్నట్లు భారత రాయబార కార్యాలయం ధృవీకరించింది. రెస్టారెంట్లోని రెండో అంతస్తులో గుర్తించిన మృతదేహాలపై ఎలాంటి గాయాలు లేకపోవడం, దాడి ఆనవాళ్లు లేకపోవడం స్పష్టమైంది. పోలీసులు ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా కార్బన్ మోనాక్సైడ్ పీల్చడమే మృతికి కారణమని భావిస్తున్నారు. రెస్టారెంట్లో విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో పవర్ జనరేటర్ను వాడడం వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు తెలిపారు. జార్జియాలోని భారత రాయబార కార్యాలయం ఈ విషాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ.. మృతదేహాలను భారత్కు తరలించేందుకు అన్ని అవసరమైన సహాయాలు అందిస్తున్నట్లు ప్రకటించింది.
ప్రమాదానికి ప్రాథమిక కారణాలు
ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, పడక గదుల సమీపంలో జనరేటర్ ఉంచడం వల్ల గ్యాస్ లీకేజీ జరిగి ఉంటుంది. అయితే ఈ మృతికి పూర్తి కారణాలను నిర్ధారించేందుకు ఫోరెన్సిక్ బృందం దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ ఘటన భారతీయ వలస కార్మికుల భద్రతపై ప్రశ్నలు లేపుతోంది. గూడౌరిలో పని చేసే 11 మంది భారతీయులు రెస్టారెంట్ సిబ్బందిగా ఉన్నారు. వారి మృతిపై భారత ప్రభుత్వం మరింత విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు.





