మెల్బోర్న్ టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. 340 పరుగుల లక్ష్య ఛేదనలో రోహిత్ 9, కోహ్లీ 5 పరుగులకే పెవిలియన్ చేరడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ నేపథ్యంలో భారత మాజీ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘విరాట్ కోహ్లీ ఇంకా మూడేళ్లు ఆడే ఛాన్స్ ఉంది. అతడి ఫిట్నెస్ బాగుంది. ఇవాళ ఔటైన తీరును వెంటనే మరిచిపోవాలి. కానీ రోహిత్ విషయంలో పరిస్థితి భిన్నం. అతడు సిరీస్ ముగిశాక ఏదైనా నిర్ణయం తీసుకుంటాడని అనుకుంటున్నా,’’ అన్నారు.
‘‘రోహిత్ ప్రస్తుతం టాప్ ఆర్డర్లో ఇబ్బందులు పడుతున్నాడు. ఫుట్వర్క్ లోపమే కారణం. బంతిని ఆలస్యంగా ఆడుతూ బౌలర్లకు చిక్కుతున్నాడు. రెండో ఇన్నింగ్స్లో పుల్ షాట్ ప్రయత్నించి ఔటైన తీరు ఇబ్బందికరమే. ఆసీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఎటాక్ చేసేందుకు ప్రయత్నించిన రోహిత్ వికెట్ కోల్పోయాడు. ఇది అతడి కెరీర్కు ప్రభావం చూపుతుందా లేదా సిరీస్ తర్వాత అతడే నిర్ణయం తీసుకోవాలి,’’ అని రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు.





