ప్రస్తుతం భారతదేశంలో చలామణిలో ఉన్న అతిపెద్ద కరెన్సీ రూ.500 కాగా, రూ.5,000 నోటు త్వరలో రాబోతుందని కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఓ క్లారిటీ ఇచ్చింది. ఆర్బీఐ, రూ.2,000 నోట్లను వెనక్కి తీసుకున్న తరువాత వాటి స్థానంలో 5,000 రూపాయల నోట్లు వస్తాయని కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అయితే, ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని, అది కేవలం పుకారు మాత్రమే అని రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది.
- చరిత్రలో పెద్ద నోట్లు: భారతదేశంలో 1938లో రూ.10,000 మరియు రూ.5,000 నోట్లను చలామణిలోకి తీసుకొచ్చారు.
- రద్దు చేసిన పెద్ద నోట్లు: 1978లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం ఆర్థిక అవకతవకలను నివారించడానికి రూ.5,000 మరియు రూ.10,000 నోట్లను రద్దు చేసింది.
ప్రస్తుతం చలామణిలో ఉన్న కరెన్సీ
భారతదేశంలో ప్రస్తుతం రూ.500, రూ.200, రూ.100, రూ.50, రూ.20, మరియు రూ.10 నోట్లు అందుబాటులో ఉన్నాయి. 2023 మే 19న ఆర్బీఐ రూ.2,000 డినామినేషన్ నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన తరువాత ఇప్పటివరకు వెనక్కి వచ్చిన రెండువేల రూపాయల నోట్లు 98.12 శాతం కాగా, ఇంకా రూ.6,691 కోట్ల విలువైన నోట్లు ప్రజల వద్ద ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది.





