దేశంలో తొలిసారిగా వందే భారత్ స్లీపర్ రైళ్లను పట్టాలెక్కించేందుకు రైల్వే శాఖ వేగంగా కసరత్తు చేస్తోంది. రైలు వేగాన్ని పెంచేందుకు రాజస్థాన్లోని కోటా రైల్వే డివిజన్లో నిర్వహించిన ప్రయోగాల్లో రైలు గరిష్ఠంగా గంటకు 180 కిలోమీటర్ల వేగాన్ని సాధించింది. ఈ ప్రయోగాల సందర్భంగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. 180 కిలోమీటర్ల వేగంతో రయ్రయ్మంటూ దూసుకెళ్లిన రైల్లోని సీట్ల వద్ద ట్రేపై ఉంచిన గ్లాస్లోని నీటి చుక్క కూడా కదలకపోవడం విశేషం. జనవరి 1న ప్రారంభమైన ఈ ప్రయోగాల్లో మొదట 130 కిలోమీటర్ల వేగంతో పరీక్షలు చేపట్టి, క్రమంగా 140, 150, 160, చివరకు 180 కి.మీ వేగాన్ని సాధించారు.
వందే భారత్ స్లీపర్ రైళ్లలో 16 బోగీలు ఉంటాయని, అందులో 10 థర్డ్ ఏసీ, 4 సెకండ్ ఏసీ, ఒక ఫస్ట్ ఏసీ బోగీ, లగేజీ కోసం రెండు బోగీలను కేటాయించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుత ప్రయోగాల సమయంలో సాధారణ ప్రయాణికులను సమం చేసే బరువుతో రైలు సామర్థ్యాన్ని పరీక్షించారు. పరీక్షలు పలు ట్రాక్స్ లో విజయవంతమయ్యాయి. మరికొన్ని నెలల్లో ఈ స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తీసుకురావడానికి రైల్వే శాఖ చర్యలు తీసుకుంటోంది.





