పేదరికం తగ్గించేందుకు ప్రభుత్వ, ప్రైవేట్, ప్రజల భాగస్వామ్యం అవసరం.. సీఎమ్ చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధిలో ముందుకు నడిపించేందుకు ప్రజల భాగస్వామ్యాన్ని కీలకంగా ఉపయోగించుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పీ-4 మోడల్ (ప్రభుత్వ, ప్రైవేట్, ప్రజల భాగస్వామ్యం) ద్వారా ప్రజల అభివృద్ధిని ఉద్భొదించనున్నట్లు ప్రకటించారు. పేదరికం మరియు అసమానతలను తగ్గించేందుకు కార్పొరేట్ సంస్థల సహకారం అవసరమని, రాష్ట్ర అభివృద్ధి కోసం స్వర్ణాంధ్ర-2047 ఆర్థిక ప్రణాళికను టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ మార్గదర్శకత్వంలో రూపొందించినట్లు తెలిపారు. ఈ ప్రణాళికలో భాగంగా, 2047 నాటికి రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు పది కీలక మార్గదర్శక సూత్రాలను ఎంచుకున్నామని వివరించారు.
సౌర విద్యుత్ ప్రాజెక్టులు, ఈవీ వినియోగం
ప్రజలను విద్యుత్ ఉత్పత్తిదారులుగా తీర్చిదిద్దే ప్రణాళిక
ఇళ్లపై సౌర విద్యుత్ ప్యానళ్ల ఏర్పాటు ద్వారా ప్రజలను విద్యుత్ ఉత్పత్తిదారులుగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చంద్రబాబు తెలిపారు. కర్బన ఉద్గారాలను తగ్గించడంలో భాగంగా విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అంతేకాదు, వ్యవసాయరంగంలో సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు డ్రోన్ టెక్నాలజీ అనుసంధానం జరుగుతోందని వివరించారు. వీటి ద్వారా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, పర్యావరణ అభివృద్ధి రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని సీఎం ధీమా వ్యక్తం చేశారు.






