దావోస్లో జరుగుతున్న ప్రపంచ దేశాల ఆర్థిక సదస్సు (డబ్ల్యూఈఎఫ్)లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పలు పారిశ్రామిక రంగాల్లో పెట్టుబడుల ప్రోత్సాహానికి చర్యలు చేపట్టారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రముఖ పారిశ్రామివేత్తలతో భేటీలు నిర్వహించారు. సమర్థమైన విద్యుత్తు సరఫరా కోసం హై ఓల్టేజీ డైరెక్ట్ కరెంట్ (హెచ్వీడీసీ) టెక్నాలజీ అమలుకు హిటాచీ ఇండియా ఎండీ భరత్ కౌశల్ సహకారాన్ని కోరారు. విస్తృత శ్రేణి నైపుణ్య కేంద్రాలు అనంతపురం, బొబ్బిలి ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నట్లు భరత్ తెలిపారు.
వ్యర్థాల నుంచి ఇంధనం!
కడప, అనంతపురం, తాడేపల్లిగూడెంలో వ్యర్థాల నుంచి ఇంధన ప్లాంట్ల ఏర్పాటు కోసం హిటాచీ జోసెస్ ఇండియా కాంట్రాక్టు ఇప్పటికే మొదలైందని వెల్లడించారు. విశాఖ, విజయవాడ, తిరుపతి నగరాల్లో ప్రపంచ వాణిజ్య కేంద్రాల ఏర్పాటుకు ప్రపంచ వాణిజ్య కేంద్రాల అసోసియేషన్ గ్లోబల్ ఛైర్ జాన్ డ్రూ సానుకూలంగా స్పందించారు. డ్రోన్ల ద్వారా మందుల సరఫరా సేవలను ప్రారంభించేందుకు వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఆరోగ్య సంరక్షణ హెడ్ శ్యామ్ బిషన్ను మంత్రి కోరారు. ఏపీని ఆరోగ్య సంరక్షణ సాంకేతిక కేంద్రంగా మార్చేందుకు సాంకేతిక మద్దతు అందించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ కార్యకలాపాలకు దక్షిణ భారత కేంద్రంగా ఏపీని ఉపయోగించుకోవాలని బిల్గేట్స్ను మంత్రి లోకేశ్ కోరారు. హెల్త్ ఇన్నోవేషన్, ఏఐ విశ్వవిద్యాలయ ఏర్పాటు వంటి కార్యక్రమాల్లో సహకారం అందించాలంటూ విజ్ఞప్తి చేశారు.










