- అశోక్ లేలాండ్ కొత్త ప్లాంట్ ప్రారంభం – ఏటా 4,800 బస్సుల తయారీ
- చంద్రబాబు రాకతో పరిశ్రమలు తిరిగి వస్తున్నాయి – మంత్రి లోకేశ్
ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలకు ఊపిరిపోస్తూ నూతన పెట్టుబడులు భారీగా సమకూరుతున్నాయి. ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ బుధవారం కృష్ణా జిల్లా మల్లవల్లిలో అశోక్ లేలాండ్ ప్లాంట్ను ప్రారంభించారు. ఇది ప్రతి ఏడాది 4,800 బస్సులను ఉత్పత్తి చేయనున్నది. తొలి దశలో 600 మంది, తర్వాత మరో 1,200 మందికి ఉపాధి లభించనుంది. ఈ కార్యక్రమంలో హిందూజా గ్రూప్ ఛైర్మన్ అశోక్ హిందూజా, అశోక్ లేలాండ్ ఛైర్మన్ ధీరజ్ హిందూజా, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
పదేళ్ల నష్టాన్ని రెండేళ్లలో రికవరీ
మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, చంద్రబాబు రాకతో పరిశ్రమలు తిరిగి రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాయన్నారు. గత ఐదేళ్ల వైకాపా పాలనలో మల్లవల్లి పారిశ్రామికవాడను నాశనం చేసి, 450 కంపెనీలను వెళ్లగొట్టారని ఆరోపించారు. అయితే, గడిచిన 9 నెలల్లోనే ₹7 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, వీటితో 4 లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయని తెలిపారు. అశోక్ లేలాండ్ లాంటి సంస్థలు వచ్చి, తక్కువ సమయంలోనే ప్లాంట్ ప్రారంభించడమే పారిశ్రామికవర్గాల్లో నమ్మకం పెరుగుతున్న సంకేతమని వ్యాఖ్యానించారు. విశాఖపట్నం పర్యాటకానికి హిందూజా గ్రూప్ ఇచ్చిన ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సును వినియోగిస్తామని చెప్పారు.





