- జంతువులకు ప్రమాదాలను ముందుగానే పసిగట్టే ప్రత్యేకమైన శక్తి ఉంది.
- భూమిలో, వాతావరణంలో జరిగే అతి చిన్న మార్పులను కూడా అవి గుర్తించగలవు.
- ఈ పరిశోధనలు భవిష్యత్తులో మనకు ఒక ఎర్లీ వార్నింగ్ సిస్టంలా ఉపయోగపడవచ్చు.
చాలామంది జంతువులు భూకంపం, తుఫాను లాంటివి రాబోయే ముందు వింతగా ప్రవర్తించడం గురించి వినే ఉంటాం. ఒకప్పుడు ఇదంతా కేవలం అపోహ, కట్టుకథ అనుకునేవారు. ఇప్పుడు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి, ఇందులో నిజం ఉందని చెబుతున్నారు. జంతువులకు ఉన్న ప్రత్యేకమైన ఇంద్రియాలు, వాటి సున్నితత్వం దీనికి ప్రధాన కారణం. భూమిలో, వాతావరణంలో జరిగే చిన్నపాటి మార్పులను అవి చాలా వేగంగా పసిగట్టగలవు. మనం గుర్తించలేని ఆ మార్పులకు అవి స్పందిస్తాయి.
ఏనుగులు వాటి పాదాల సాయంతో అతి తక్కువ ఫ్రీక్వెన్సీలో ఉండే ప్రకంపనలను పసిగట్టగలవు. భూమి లోపల జరిగే చిన్నపాటి కదలికలను కూడా అవి గుర్తించగలవని పరిశోధకులు చెబుతున్నారు. అందుకే సునామీ వచ్చే కొన్ని గంటల ముందు ఏనుగుల గుంపులు సురక్షితమైన ఎత్తైన ప్రదేశాలకు వెళ్లిపోవడం కనిపిస్తుంది. పెంపుడు జంతువులైన కుక్కలు, పిల్లులకు వినికిడి శక్తి చాలా ఎక్కువ. భూకంపాలు, తుఫానులు వచ్చే ముందు కుక్కలు అరిచి గొడవ చేయడం, ఆందోళనగా ప్రవర్తించడం, పిల్లులు దాక్కోవడం లాంటివి చేస్తుంటాయి. పక్షులు గాలి పీడనం, వాతావరణంలో మార్పులకు చాలా త్వరగా స్పందిస్తాయి. పెద్ద తుఫానులు వచ్చే ముందు పక్షులు ఒక్కసారిగా ఎటుపడితే అటు ఎగరడం లేదా అవి వెళ్లాల్సిన దిశను మార్చుకుని ప్రయాణించడం లాంటివి చేస్తుంటాయి. ఇటలీలో భూకంపం రాబోయే కొన్ని రోజుల ముందు కప్పలు వాటి సంతానోత్పత్తి ప్రదేశాల నుంచి మాయమయ్యాయి. ఈ పరిశోధనల ఆధారంగా జంతువుల ప్రవర్తనను అధ్యయనం చేయడం ఒక కొత్త టెక్నాలజీకి దారితీస్తోంది. ICARUS (International Cooperation for Animal Research Using Space) లాంటి ప్రాజెక్టులు జంతువులకు జీపీఎస్ కాలర్స్, ట్రాకింగ్ డివైస్లు అమర్చి వాటి కదలికలను పరిశీలిస్తున్నాయి. భవిష్యత్తులో ఈ పరిశోధనలు ప్రకృతి విపత్తులను ముందే పసిగట్టడంలో ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.





