బుర్రలో చిప్ పెట్టుకునే తిరిగే ఇస్మార్ట్ శంకర్లను ఇప్పటి వరకూ తెలుగు సినిమాల్లో చూశాం. ఇకపై మన చుట్టూనే ఉండొచ్చు! ఎందుకంటే.. బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ లు (బీసీఐ) వచ్చేస్తున్నాయ్. ఓ చిన్న చిప్ ని బ్రెయిన్ లో పెట్టేస్తారు. ఇక అన్నీ అదే చూసుకుంటుంది. సమాచారాన్ని అదే ట్రాన్స్ ఫర్ చేసేస్తుంది. కనీసం కదిలే అవసరం కూడా లేదు. మెదడులోకి ఆలోచన రాగానే బుర్రలోని చిప్ దాన్ని గ్రహించి.. కమాండ్ లా తీసుకుంటుంది. ప్రాసెస్ చేసి కమాండ్ రూపంలో కనెక్ట్ చేసి డివైజ్ లకు పంపేస్తుంది. ఆస్ట్రేలియాకి చెందిన సింకోన్ అనే సంస్థ అలాంటి చిప్ ని తయారు చేసింది. కదల్లేని స్థితిలో ఉన్న 64 ఏళ్ల వయసున్న ఓ పెద్దాయన బుర్రలో పెట్టింది.
చిప్ ని అమెజాన్ వాయిస్ అసిస్టెంట్ ‘అలెక్సా’కి అనుసంధానం చేశారు. దీంతో ఆ పెద్దాయని కంప్యూటర్ ముందు కూర్చుని తన ఆలోచనలతోనే సిస్టమ్ యాక్సెస్ చేయగలిగాడు. తనకి కావాల్సిన వాటిని అమెజాన్ లో షాపింగ్ చేయగలిగాడు కూడా. అంతేకాదు.. ట్రయల్ రన్ లో భాగంగా బీసీఐ టెక్నాలజీని ఐఫోన్, ఐప్యాడ్ పైనా ప్రయత్నించారు. దీంతో పక్షవాతానికి గురైన రోగులు కేవలం థాట్స్ తోనే వాటిని వాడగలిగారట. బ్రెయిన్ ఇంటర్ఫేస్ కంప్యూటర్లను ఇలా వాయిస్ అసిస్టెంట్ లకు అనుసంధానించి వాడడం ఇదో తొలిసారి అని రూపకర్తలు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రయోగాత్మక స్థితిలో ఉన్న ఈ బ్రెయిన్ ఇంటర్ఫేస్ కంపూటర్లు త్వరలోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నయాట. దీంతో బాడీలో చలనం కోల్పోయిన ఎంతోమంది అభాగ్యులకు ఈ బీసీఐ తోడుగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.





