హైదరాబాద్ నగరంలో దుర్ఘటన చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన కారు బైక్ను ఢీకొట్టిన ఘటనలో ఇంజినీరింగ్ విద్యార్థిని మృతిచెందింది. కామారెడ్డి జిల్లా దోమకొండకు చెందిన ఐరేని శివాని (21) గండిపేట సీబీఐటీలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతోంది. పూర్వ విద్యార్థుల సమ్మేళనం కోసం ఆదివారం నిజాంసాగర్ వెళ్లిన శివాని, స్నేహితులతో సరదాగా గడిపి తిరిగి నగరానికి చేరుకుంది. జేఎన్టీయూ వద్ద బస్సు దిగిన ఆమెను సీనియర్ విద్యార్థి వెంకట్రెడ్డి (26), తన బైక్పై పీజీకి తీసుకెళ్లేందుకు బయలుదేరాడు. అర్ధరాత్రి 1.50 గంటల సమయంలో నానక్రాంగూడ రోటరీ సమీపంలో వేగంగా వచ్చిన కారు వారి బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శివాని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, వెంకట్రెడ్డి పరిస్థితి విషమంగా ఉందని రాయదుర్గం ఎస్ఐ ప్రణయ్తేజ్ తెలిపారు. కారును నడిపిన సాయికైలాష్ (19)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చదువులో మెరుగైన ప్రతిభ చూపిన శివాని ఇటీవల క్యాంపస్ సెలక్షన్లో ఉద్యోగానికి ఎంపికై, నాలుగు నెలల్లో చేరాల్సి ఉండేది. ఈ ఘటనతో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.





