దుబయి వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు విజయం సాధించినా, షమీ తీసుకున్న నిర్ణయంపై చర్చ కొనసాగుతోంది. మ్యాచ్ సమయంలో నీళ్లు తాగడంపై విమర్శలు.. ఇంజమామ్, జావేద్ అక్తర్ సహా పలువురు ప్రముఖులు స్పందించారు.
ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో మ్యాచ్ జరుగుతున్న సమయంలో భారత పేసర్ మొహమ్మద్ షమీ నీళ్లు తాగారు. దీన్ని రంజాన్ ఉపవాస నిబంధనలకు వ్యతిరేకంగా పేర్కొంటూ కొందరు విమర్శలు గుప్పించారు. ముస్లిం సమాజంలోని కొందరు నేతలు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆలిండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా షాబుద్దీన్ రజ్వీ బరేల్వీ మాట్లాడుతూ, ఉపవాసం నిషేధిత సమయాల్లో దాహం తీర్చుకోవడం మతపరమైన నిబంధనలకు విరుద్ధమని వ్యాఖ్యానించారు.
ఇంజమామ్-ఉల్-హక్, జావేద్ అక్తర్ స్పందన
ఈ విషయంపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఇంజమామ్-ఉల్-హక్ మాట్లాడుతూ, “ఆడేటప్పుడు ఉపవాసం చేయడం కష్టమే. అయితే, స్క్రీన్ వెనుకపోయి తాగాల్సిందే తప్ప, అందరి ముందు తాగకూడదు,” అని అభిప్రాయపడ్డారు. మరోవైపు, బాలీవుడ్ గీత రచయిత జావేద్ అక్తర్ మాత్రం షమీకి మద్దతుగా, “నీరు తాగడంపై విమర్శించే మూర్ఖుల మాటలు పట్టించుకోనక్కర్లేదు. మీరు గొప్ప భారత క్రికెటర్,” అని ట్వీట్ చేశారు.





