జమ్మూకశ్మీర్లోని పహల్గాం బైసరన్ లోయలో ఏప్రిల్ 22, 2025న జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడంపై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నరమేధానికి పాల్పడిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించడంతో పాటు, వారికి మద్దతిచ్చే పాకిస్థాన్ను బాధ్యులుగా నిలబెట్టాలని నిర్ణయించింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన దిల్లీలో జరిగిన భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఎస్) సమావేశంలో పాక్తో దౌత్య సంబంధాలను తగ్గించడం, సింధూ జలాల ఒప్పందం నిలిపివేయడం, అటారీ సరిహద్దు మూసివేయడం వంటి కీలక నిర్ణయాలు తీసుకుంది. సరిహద్దుల్లో భద్రతా బలగాలను అప్రమత్తం చేసిన కేంద్రం, ఉగ్రవాదుల ఆచూకీ తెలిపినవారికి రూ.20 లక్షల బహుమతి ప్రకటించింది. ఈ దాడిని ఖండిస్తూ అమెరికా, ఫ్రాన్స్ సహా పలు దేశాలు భారత్కు సంఘీభావం తెలిపాయి.
ఈ ఘోర దాడి భారత హృదయంపై గాయం. ఉగ్రవాదులను, వారి స్పాన్సర్లను శిక్షించకుండా ఊరుకోం. పాకిస్థాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని వీడే వరకూ కఠిన చర్యలు తీసుకుంటాం,” అని సీసీఎస్ సమావేశం తర్వాత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ హెచ్చరించారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం పహల్గాం ఘటనా స్థలాన్ని పరిశీలించి, శ్రీనగర్లో మృతదేహాలకు నివాళులర్పించారు. అనంతనాగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. జమ్మూకశ్మీర్ ప్రభుత్వం బాధిత కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడినవారికి రూ.2 లక్షలు, స్వల్ప గాయాలతో బాధపడేవారికి రూ.1 లక్ష పరిహారం ప్రకటించింది. దాడి నేపథ్యంలో పర్యాటకులు కశ్మీర్ నుంచి స్వస్థలాలకు తిరిగి వెళ్తుండగా, హోటల్, విమాన రిజర్వేషన్లు భారీగా రద్దవుతున్నాయి. భద్రతా దళాలు సర్జీవన్ వద్ద ఇద్దరు ఉగ్రవాదులను ఎన్కౌంటర్లో మట్టుబెట్టి, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. గురువారం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరగనుంది.





